28, జులై 2010, బుధవారం

మత్తేభ ఘీంకారమా! మూషికా చుంచునాదమా!

హ్యూస్టన్లో జరగబోయే అష్టావధంలో పృచ్ఛకుడిగా వ్యవహరించమని శాయి రాచకొండ ఆఙ్ఞాపించారు, నేనేదో పద్యాల్లో పిస్తా అనుకొని. ప్రయత్నించకుండా ఓడిపోవడం కన్నా, ప్రయత్నించి విఫలమవ్వడమే ఉత్తమమని, అంగీకరించాను. అప్పుడు ఆంధ్రామృతం, శంకరాభరణం, తెలుగు పద్యం, బ్లాగాడిస్తా, ఊకదంపుడు, ప్రజా బలం, ఇలాంటి కొన్ని పద్య ప్రియుల బ్లాగుల్ల్ని శోధించి, ఈ దత్తపది తయారుచేసుకొన్నాను.

కాఫీ అట్టు, ఇడ్లీ, పూరీ, ఉప్మా - ఈ పదాలను ఉపయోగిస్తూ, ముంబాయి మారణకాండని గజేంద్ర మోక్షానికి అన్వయిస్తూ, మత్తేభంలో.

కానీ పూరించడమెలా? ఒకవేళ అవధాని పూరించలేని పక్షంలో పృచ్ఛకుడు దాన్ని పూరించే స్థితిలో ఉండాలి, లేకపోతే అభాసుపాలు కాకతప్పదని ఆచార్య చింతా రామకృష్ణారావుగారు చెప్పియున్నారు. తప్పులూ, తడకలతో, ఏవో చిన్న చిన్న కందాలు తప్పా, వృత్తాలు రాయలేదే!
కం
రాయగ నైతిని వృత్తము
రాయని మురిపింపగన్, సరసులొప్పంగన్.
సాయము సేయగ రారా
పూయగ విద్యా సుగంధముల్ పదశిఖరా!
అని కవిశేఖరులని వేడుకోవడం జరిగింది. ఆచార్య చింతా రామకృష్ణారావు (ఆంధ్రామృతం) గారు ఈ విధంగా పూరిస్తూ,

కసభుక్కీలదురంత నక్ర మిచటన్ "కాల్చుండిది డ్లీయనన్"
ముసుగుల్ దాలిచి పట్టె మమ్ము గనుమా! పూరీ జగన్నాయకా!
ఉసురుల్ తీయగ నుండె కావుమిలలో ఉప్మాక దేవా మమున్
విషమంబియ్యది. యిట్టి చిన్న పనికా ఫిర్యాదటంచెంచకన్!
(కాల్చుండు + ఇది + ఈ +డ్లీ ( ఈ + ఢిల్లీ = ఇడ్లీ ) = కాల్చుండిదిడ్లీ)

(ముసుగు = పొగు ముసుగు)

నన్ను స్వంతంగా ప్రయతించమన్నారు. అనేక దోషాలతో కూడిన నా పూరణ ఇలా సాగింది:

నరుడై యార్తిని జుఱ్ఱుకొంగొనిన ముంబైయ్యవ్వనిన్ నే, కసా
యిరురువ్వై వధియించె ప్రాణులను. ఓ పూరీ జగన్నాధ! ఇ
డ్లియు కాఫీలిడుతున్. హ*. కావుమయ! హూం**! ఘర్జించె నాశ్రీహరే
నరుడై అట్టుడకంగ, నా కసబు అంతంబయ్యె. ఉప్మాక శ్రీ!
రురువు = మృగము
హ* నిరాశతో కూడిన ఒక నిట్టూర్పు
హూం** ఆ ఘీంకార శబ్ధము హూం అని వినిపించుచున్నది
వ్యాఖ్యానము/వివరణ:
గజేంద్రుడు, ఉప్మాక క్షేత్ర దైవము అయిన మహా విష్ణువు కలి యుగంలో మంచి స్నేహితులు. మన కొత్త తెలుగు సినిమాల్లో కుఱ్ఱ హీరో నాన్నని ఒరేయ్ అని, అమ్మని ఒసేయ్ అన్నంత స్నేహమన్నమాట. ఉప్మాక (ఉపమా + క = పోలికలేని, సాటిలేని, అని నా స్వంత అభిప్రాయము) స్వామి తో గజేంద్రుదు ఇలాచెప్తున్నాడు.

నేను మానవావతారం ఎత్తి, మానవులకు మాత్రమే ఉండే కామప్రకోపపైత్యాదులకు లోబడినవాడినై, దేహార్తిని తీర్చుకొనుటకు వారవనితైన ముంబాయి మహానగర యవ్వన అందాలను తిలకిస్తుండగా, ఒక కసాయి, మృగమువలె కనబడుచున్న ప్రాణులన్నిటినీ హతమొందించెను. గత జన్మలో నన్ను కాపాడినట్టె, ఇప్పుడు కూడా కాపాడవయ్యా, ఓ పూరీ జగన్నాధా, నీకు ఇడ్లీ కాఫీ లాంటి ఉపహారములు కూడా ఇస్తాను అని ప్రార్ధించగా (మరి ఈ కాలంలో దేవుడికి కూడా లంచాలు ఇవ్వాలి కదా), వెంటనే, ఆ శ్రీహరే, తన గత జన్మ నృసింహావతారమును తలపించే విధంగా ఘీంకరించాడు. ఆ ఘీంకారమున కా కసబనే కసాయి మరణించాడు. కథ అయిపోయింది, పవళింపుసేవ చాలిక లేవవయ్యా, ఉప్మాక పతీ!
నా మూషికానాదంలో తప్పులు చూపమని, వీలైతే సవరణలు చేయాల్సింది గా రవి (బ్లాగాడిస్తా) గారిని, వారి సలహాపై భైరభట్ల (తెలుగు పద్యం) గారిని సంప్రదించాను. భైరవభట్ల గారు,

"కాఫి" బదులు "అట్టు" అయితేనే బాగుంటుందేమో. "కాఫీ" ఇచ్చినా అది "కాపీ" కింద మార్చుకొని పూరిస్తారు. అలాగే ప్రత్యేకించి ముంబయి మారణకాండ అని అడగడం కన్నా, తీవ్రవాద సమస్యని గజేంద్రమోక్షంతో అనుసంధానించి చెప్పమంటే పోలికకి బాగుంతుందని నాకనిపించింది. ఆ భావంతో నేను చేసిన పూరణ:

ఉపమానమ్ము గజేంద్రుతో జగతికిన్నూహింపగా నౌను ఘో
ర పిశాచమ్మగు తీవ్రవాద ఝష దంష్ట్రన్ జిక్కినట్టుండె దా
విపరీత ద్విషపూరితంబులయి కంపించెన్ యువస్వాంతముల్
తపనల్ దీరగ చక్ర రక్షనిడి లీలన్ బ్రోవరా యీశ్వరా!

పూరణలో యతులు సరిపోలేదు (చివరిపాదంలో తప్ప). "రురువు" + "అయి" = "రురువై" అవుతుంది కాని "రురువ్వై" అవదు. "ఉపమా" ని "ఉప్మా" చెయ్యడానికి వ్యాకరణం ఒప్పుకోదు :-) అది "ఉప్మాక" దేవుడిని సూచించినట్టుగానే తీసుకోవచ్చు కదా.


ఈ వ్యవహారమంతా, ఈమైల్సు ద్వారా కనుక ఎవరు స్పందిస్తారో, ఎవరు స్పందించరో తెలియదు
కదా (అడిగన అంతమందీ ప్రత్యుత్తరమిచ్చారనుకోండీ)! అందుకని నా దగ్గర ఉన్న చివరి
బ్రహ్మాస్త్రం ప్రయోగించడనికి సిద్ధపడ్డాను.


మానాప్రగడ శేషశాయి గారు, విజయనగరం మహరాజా సంస్కృతకళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు. వారిల్లు మా ఇంటి పెరడులోనే ఉంటుంది (చిత్రంలో, కూర్చున్నవారు ఎడమ నుంచి కుడి: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మానాప్రగడ శేషశయి. నిల్చున్న వరుసా మధ్య ఇద్దరూ, అమ్మా, నాన్న). అందుకని, మా అమ్మని విసిగించి, అమ్మతో చెప్పాను, "అమ్మా ఆయనకి ఈ పద్యం ఒకసారి చూపించు. సవరణలు చేస్తారు" అని. కాకపోతే ఆయనంటే భయం, "ఎవడ్రా ఈ పద్యం రాసిందీ, ఇన్ని దోషాలతో" అనిఅంటారని. కాబట్టి ముందే చెప్పాను, ఒకవేళ అక్షింతలు పడితే "అవి నావే, నీవికాదు" అని ఒప్పించాను. ఆ పద్యం చూసి, కొంచెం వినికిడి, దృష్టి తగ్గినా, ఎన్నో పనులున్నా అవన్నీ మనుకుని, పద్యాన్ని పూర్తిగా మార్చకుండా, "మనం వాడి లోకి పరకాయ ప్రవేశం చెయ్యాలే. మనంతట మనం రాసిస్తే వాడికి సంతృప్తి ఎక్కడుంటుందీ" అని, ఒక పావుగంట సేపు ప్రయత్నించి, ఇచ్చిపంపారు. నా పూరణ కి వారి సవరణ ఇదిగో:
పరుడైఆర్తినిజుఱ్ఱుకొంగొనిన ముంబై జవ్వనిన్ రే కసా
బుర్వై మ్రింగెనుప్రాణిలొకమడలన్ ఓ పూరీశ్రీ నాధ సాం
బరు ఇడ్లీ ఉపమా దయన్ గొనుచు బ్రోవన్ రావెనీవె
పరాత్ప్రరవేవేగ హరింపనట్టుడుకు వంతన్ భక్త చింతామణి!

ఆ ఒక్క, "నరుడై" ని "పరుడై" గాను, "నే" ని "రే " గాను మార్చి, ఎంత అర్ధవంతంగా మార్చారో గమనించారా. ఆవిధంగా, మూడుమత్తేభ ఘీంకారాలు, ఒక మూషికానాదంతో, దత్తపది అంకం ముగిసింది. ఇందుకు ఇతోధిక సహాయం చేసిన కవిశేఖరులు: ఆచార్య మానాప్రగడ శేషశాయి, ఆచార్య కంది శంకరయ్య, ఆచార్య చింతా రామకృష్ణారావు, శ్రీ రవి (బ్లాగాడిస్తా), శ్రీ భైరభట్ల. వీరందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

3 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

సోమశేఖర్ గారూ,
వద్దిపర్తి పద్మాకర్ గారి అష్టావధాన విశేషాలు, మీరిచ్చిన దత్తపది, అందుకోసం మీరు పడిన శ్రమ, మిగిలిన కవుల పద్యాలు, మీ పద్యానికి శ్రీ మానాప్రగడ శేషశాయి గారి సవరణ అన్నీ చదివి ఆనందించాను. మీకు నా అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ!సోమ శేఖరా! శుభమస్తు.
మీ అసంఖ్య బ్లాగును మీదిగా ఇప్పుడే తెలుసుకొని చూచాను.
మొన్నటి అవధాన విశేషాలను కళ్ళకు కట్టినట్లు అర్థమయినవి. చాలా ఆనందించాను.
అందు నీ యొక్క తాదాత్మ్యత నాకెంతో సంతోషం కలిగించింది.
బహుశా అవధానానికి సంబంధించిన ఆడియో కూడా ఉంటుందే!
ఉంటే వీలైతే మీ బ్లాగులో ఉంచ గలిగితే మేమంతా ప్రత్యక్షానుభూతి పొందుతాం.
ఇంతకీ అవధానం జరిగిన ప్రదేశ మెక్కడో స్ఫురించడం లేదు. మన ఆంధ్రాలోనేనా? విజయనగరం దగ్గరలోనేనా?
సరే చిదేశాలలోనేమో అనే అనుమానంతో యీప్రశ్న వేసానంతే.
ఇక బ్రహ్మశ్రీ మానాప్రగడ శేషశాయిగారి వద్దే నా విద్యాభ్యాసం జరిగింది. భాషాప్రవీణ విజయనగరంలో మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో జరిగింది. ౧౯౬౯ -౧౯౭౨ మార్చ్ వరకు.
శేష శాయిగారి ప్రసన్న భాస్కరం " ఆంధ్రామృతంలో ఉంది " చూచే ఉంటారు మీరంతా.
నీ కృషిని అభినందిస్తున్నాను.
శ్రీరామ రక్ష.

రవి చెప్పారు...

మహామహుల మధ్య నా పేరు తెచ్చారేమిటండి? నాకసలు ఏమీ రాదు.

అయినా పెరట్లో ఔషధం పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది మీ వరస.

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును